మహబూబాబాద్ : ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని వెలికట్ట గ్రామంలో సంపూర్ణ స్వచ్ఛత కోసం స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుందన్నారు. బహిరంగ మల మూత్ర విసర్జన రహిత రాష్ట్రంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఉందన్నారు. ఇంకా ఎక్కడైనా బహిరంగ మలమూత్ర విసర్జన పరిస్థితులు ఉంటే, వెంటనే రూపుమాపాలన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. బహిరంగ మల మూత్ర విసర్జన నివారణ కోసం కృషి చేస్తున్న గ్రామ పంచాయతీని, ప్రజలను దయాకర్ రావు అభినందించారు. వెలికట్ట గ్రామం ఈ రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వెలికట్ట గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.