మహబూబాబాద్ : అన్ని పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని పెంచేలా ఏర్పాట్లు ఉండాలని ఆయన సూచించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. పాఠశాలలో త్రాగునీరు, శానిటేషన్, టాయిలెట్లు, మధ్యాహ్న భోజనం అమలు, ఇతర వసతులను ఆయన పరిశీలించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించామని, ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉపాధ్యాయులను కోరారు.
మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు కచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూడాలని ఉపాధ్యాయులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు మంత్రి దయాకర్ రావు వెంట ఉన్నారు.