Minister Errabelli Dayaker Rao | హరిపిరాల, కర్కాల (తొర్రూరు) : ఇది రైతు ప్రభుత్వం.. సీఎం కేసీఆర్( CM KCR ) రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) రూపొందించి అమలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రైతులు( Farmers ) నష్టపోకుండా చివరకు పంటలు కూడా కొనుగోలు చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్ తప్పకుండా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారు అని స్పష్టం చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడాల్సిన పనిలేదు. వారికి అండగా ప్రభుత్వం ఉంటుంది అని తేల్చిచెప్పారు. మేమంతా అన్నదాతలకు అండగా ఉంటాం.. పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తాం అని పేర్కొన్నారు.
తొర్రూరు మండలం హరిపిరాల, కర్కాల గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తూ ఆయా రైతులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. మంత్రిని చూసిన రైతులు బోరుమన్నారు. తమకు పరిహారం ఇప్పించాలని తీరని, తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన తమకు అండగా నిలిచి ఆదుకోవాలని వారు విలపించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చిన మంత్రి ధైర్యాన్ని నింపుతూ భరోసానిస్తూ, అక్కున చేర్చుకున్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో గల ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులను పంట నష్టాలను పరిశీలించాలని ఆదేశించారని ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ తమతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు. ఈ పరిశీలనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.