జనగామ : పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన పల్లెలు బాగు పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు. గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 3వ తేదీ నుండి చేపట్టనున్న 5వ విడత పల్లె ప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతి సన్నాహక సమీక్ష సమావేశాన్ని జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడమే విజయానికి కారణంగా పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో 20 పంచాయతీలు గుర్తింపు పొందగా అందులో 19 పంచాయతీలు జనగామ జిల్లాలో ఉండటం గర్వకారణంగా పేర్కొన్నారు. అధికారులు గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిత్యం ఇంటింటికి చెత్త సేకరణ జరగాలన్నారు. సేకరించిన చెత్త సెగ్రిగేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్మి కంపోస్టు చేపట్టి గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచాలన్నారు. వైకుంఠధామాల నిర్వహణ తప్పనిసరిగా జరగాలన్నారు. వైకుంఠధామాల్లో పూల మొక్కలతో ఫెన్సింగ్ చేపట్టాలని నీటి సౌకర్యం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.