జనగామ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని, చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను చెప్పానని తెలిపారు. అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఈ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఘనంగా నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ, ప్రతి ఇంటికి జాతీయ పతాకం చేర్చాలి. ఆ జెండాలు ప్రతి ఇంటిమీద ఎగురు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం కల్పించాలి. గ్రామ గ్రామాన క్రీడా స్ఫూర్తి నెలకొలుపుతూ క్రీడా ప్రాంగణాలల్లో ఫ్రీడం రన్ నిర్వహించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.