హైదరాబాద్ : దేశంలో బీజేపీ పతనానికి మునుగోడు నియోజకవర్గం నాంది కానుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీకి మునుగోడులో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ నిరాశా నిస్పృహలకు లోనై, టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులకు దిగుతుందని, ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగడాన్ని మంత్రి ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదన్నారు. బీజేపీ ప్రేరేపిత దాడులకు భయపడేది లేదని, అయితే, టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని, దానికి తగ్గట్లుగా ఎవరి భావాలను, విధానాలను స్వేచ్ఛగా వెల్లడించుకోవాలే తప్ప, ఇలా భౌతిక దాడులకు దిగడం అనైతికం అన్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు.