జనగామ : రాష్ట్రంలో త్వరలోనే అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అయితే ఈ భవనాలను ఆయా పాఠశాలల ఆవరణలోనే కట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు కేసీఆర్ మూడుసార్లు జీతాలు పెంచి రూ. 13,600 చేశారని మంత్రి తెలిపారు. హెల్పర్స్కు కూడా రూ. 6,700కు పెంచారని గుర్తు చేశారు. టీచర్లు, హెల్పర్లు అంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వేతనాలు పెంచాలని అడిగితే.. గుర్రాలతో తొక్కించారు.. లాఠీలు ఝుళిపించారని గుర్తు చేశారు. అంగన్వాడీ అనేది గ్రామీణ పిల్లల సంరక్షణ కేంద్రం అని మంత్రి తెలిపారు. పిల్లల ఆకలి తీర్చడంతో పాటు, పోషకాహారాన్ని అందించడం అంగన్వాడీల ప్రధాన విధి అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, నిర్మల, ఎల్లమ్మ, మస్కు అరుణ, రేణుక, రజిత, ఉమ, తదితరులు పాల్గొన్నారు.