హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతి భవన్ మీద నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఇలాంటి అసాంఘిక మాటలపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని, ప్రజలు తరిమికొడుతారని దయాకర్ రావు హెచ్చరించారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేశ్తో కలిసి మంత్రి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు.
ములుగులో పాదయాత్ర మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రజల నుంచి స్పందన లేక, నర్సంపేటలో జనం తిరగబడితే వాహనంలో ఎక్కి పారిపోయారని తెలిపారు. ఈ క్రమంలోనే తీవ్ర నిరుత్సాహనికి గురైన రేవంత్ రెడ్డి ప్రగతి భవన్పై నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తగిన పరిణామాలుంటాయని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా? ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పాలని దయాకర్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలు పార్టీపరమైనవి అయితే ఒక విధానంలో, వ్యక్తిగతమైనవి అయితే మరొక విధానంలో వ్యవహరించాల్సి వస్తుందన్నారు. నక్సలైట్లను నిషేధించిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రేవంత్ రెడ్డి ఈ మాటలతో వ్యతిరేకిస్తున్నారా స్పష్టం చేయాలన్నారు. గాంధేయవాదంతో వ్యవహరించే కాంగ్రెస్ నేడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాడ్సే విధానంలో వెళ్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని దయాకర్ రావు పేర్కొన్నారు.