యాదాద్రి/సంగెం, జూన్29: ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునర్నిర్మించారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి మంత్రి దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకబృందం వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతంలో యాదగిరిగుట్టకు వచ్చినవారు ఇప్పుడు ఈ క్షేత్రాన్ని చూస్తే ఆశ్చర్యపోయేలా అభివృద్ధి జరిగిందని చెప్పారు. మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఆలయ ప్రాంగణంలోనే సకల సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు.
సబ్బండ వర్ణాల సంక్షేమానికి సీఎం కృషి
సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి, తీగరాజుపల్లి, సోమ్లాతండా, మొండ్రాయి, గొల్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ గోపితో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ఆశాలపల్లిలో పాఠశాలకు రూ.43 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. రూ.80 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో డంపింగ్ యార్డులను ప్రారంభించారు.
మహిళా సంఘాలకు రూ.3.20 కోట్ల చెక్కులను అందజేశారు. అనంతరం విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు దీటుగా ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ బావుల వద్ద కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ.. కేసీఆర్పై ఒత్తిడి తెస్తున్నా రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఒప్పుకోలేదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.