హనుమకొండ: నలభై ఏండ్లల్లో ఎన్నడూ లేని వర్షాలు ఈసారి పడ్డాయని, వరదలపై విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. వరదలతో చాల కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు. నీట మునిగిన కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వారికి ఆహారం, మంచినీటి బాటిళ్లు అందించామని తెలిపారు. హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని జవహర్కాలనీ, గుండ్ల సింగారం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా కష్టపడ్డారని, వారి శ్రమ వెలకట్టలేదని చెప్పారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు సహాయం అందించారని తెలిపారు. వరంగల్ వరదలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడించారు.
అనంతరం మామునూరు హెలీప్యాడ్ నుంచి ఏటూరు నాగారం, కొండాయిలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలు, తాగు నీరు, మందులను హెలికాప్టర్ ద్వారా పంపించారు. భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాధితుల కోసం ప్రత్యేక హెలికాప్టర్ను, సహాయక బృంధాలను పంపించారు.