పాలకుర్తి: దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్థాయి నేత బాబూ జగ్జీవన్రామ్ (Babu Jagjivan Ram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దళితుల ఆత్మబంధువుగా దళితబంధు (Dalith bandhu) పథకాన్ని అమలుచేస్తున్న సందర్భంలోనే.. దళితుల అభ్యున్నతికి తన జీవితాంతం పాటుపడిన జగ్జీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నామని చెప్పారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా హనుమకొండలోని పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశం చేర్చడంలో జగ్జీవన్రామ్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. బీహార్ అసెంబ్లీతోపాటు పార్లమెంటులో 40 ఏండ్లపాటు ప్రజాప్రతినిథిగా ఉన్నారని గుర్తుచేశారు. భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంలో బాబూజీ కీలకంగా ఉన్నారని చెప్పారు. వారి స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన సాగుతున్నదని వెల్లడించారు.
దళితుల బాగుకోసం దేశంలో ఎవరూ చేయలేని విధంగా దళితబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. తాజా బడ్జెట్లో దళితబంధు పథకానికి సీఎం కేసీఆర్ రూ.17 వేల 700 కోట్లు కేటాయించారని చెప్పారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్దిదారుని అకౌంట్లోకే డబ్బు చేరుతుందని తెలిపారు. మొదటి విడుతలో నియోజకవర్గానికి వెయ్యి మందికి చొప్పున దళితబంధు ఇచ్చామని, తర్వలో మరికొందరికి ఇస్తామన్నారు.