హైదరాబాద్: దళితుల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) నిరంతరం కృషి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పారు. రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా అన్ని రంగాల్లో సేవచేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని మొదట పోరాటం చేసింది అంబేద్కరేనని చెప్పారు. తనలా మరెవరికీ అవమానం జరగొద్దని దేశ న్యాయ శాఖ మంత్రి అయ్యాక దళితులకు రిజర్వేషన్లను కల్పించారని గుర్తుచేశారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, అలాంటి రాజ్యాంగాన్ని రాసి చరిత్రలో నిలిచిపోయారని వెల్లడించారు. ఆయన ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో పాలన సాగుతున్నదని చెప్పారు. దళితులకు నిజమైన ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడించారు. దళితుల బాగుకోసం దేశంలో ఎవరూ చేయలేని విధంగా దళిత బంధు (Dalit Bandhu) పథకాన్ని అమలుచేస్తున్నారని తెలిపారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్దిదారుని అకౌంట్లలోనే పైసలు పడతాయన్నారు. వైన్షాపులు, మెడికల్ షాపులు, కెమికల్ దుకాణాలు, రైసు మిల్లుల వంటి వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్సుల కోసం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు రూ.1.70 లక్షల కోట్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.#AmbedkarJayanti pic.twitter.com/3zxkMtjCHv
— Errabelli DayakarRao (@DayakarRao2019) April 14, 2023