హనుమకొండ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దివంగత ప్రధాని వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని పీవీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం చాలా ముందుకెళ్లిందనీ, నిజాయితీగా పనిచేసిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆ మహానుభావుడు తెలంగాణ వాడు కావడం, అందులోనూ వరంగల్ బిడ్డ అవ్వడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. ప్రధానిగా ఎలా ఉండాలి? ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి? అని నిరూపించిన మహానుభావుడు పీవీ నరసింహారావు అన్నారు. అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.