హైదరాబాద్ : 2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ బడుగు జీవితాలను మార్చే బడ్జెట్ అని, ఇది ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించినట్లు ఎర్రబెల్లి తెలిపారు. 2022-23 సంవత్సర రాష్ట్ర బడ్జెట్లో 29 వేల 585 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమానికి 3 వేల 330 కోట్ల రూపాయలు, ఆసరా పెన్షన్లకు 11వేల 728 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అంతే కాకుండా గిరిజన, ఆదివాసి గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు, మహిళలు ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సాహానికి పావలా వడ్డీ స్కీమ్ కింద 187 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి తోడుగా ప్రతి నెల గ్రామీణ స్థానిక సంస్థల (గ్రామ పంచాయితీ, మండల పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్) నిర్వహణకు 220 కోట్ల 50 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
దీనికి తోడుగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల పది వేల మహిళా స్వయం సహాయక సంఘాలకు 11 వేల 750 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర జనాభాలో 61 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధిక నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆర్థిక శాఖ మంత్రికి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.