హైదరాబాద్ : జనగామ జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. ప్రగతి భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డికి సీఎం కేసీఆర్ పరిపాలన ఉత్తర్వులను అందజేశారు. రూ.190కోట్ల అంచనా వ్యయంతో.. వంద ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటుతో పాటు అనుబంధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది.
గతంలో జనగామ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులను నేతలు అందుకోగా.. వెంటనే మెడికల్ కాలేజీకి సంబంధించిన పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఇచ్చిన హామీ మేరకు జనగామకు వైద్య కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు నేతలు ధన్యవాదాలు తెలిపారు.