Minister Dayakar Rao | కాంగ్రెస్ పార్టీ రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదని, వ్యవసాయానికి ఎప్పుడూ సరిగా కరెంటు ఇవ్వలేదని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలపై టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో నిరసనలు, బయట ధర్నాలు చేసిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గుర్తుచేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ తరఫున తనతోపాటు ఎన్నోసార్లు రేవంత్రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే తెలియన రేవంత్రెడ్డి సాగుకు మూడు గంటల కరెంటు సరిపోతుందని ఎలా అంటారని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని.. ఆయన రైతు కాదని, రైతు బిడ్డ కాదని చెప్పారు. ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజుయాదవ్తో కలిసి మంత్రి దయాకర్రావు సోమవారం హనుమకొండలో విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సాగుకు ఉచితంగా 24 గంటలపాటు కరెంటు ఇస్తుంటే, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటలే ఇస్తామని చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలను చూసి రైతులు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడితే ఏడు గంటల కరెంటు ఉండదని వైఎస్ఆర్, తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని కిరణ్కుమార్రెడ్డి అన్నారని, వీరిద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అనే విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మనకు సరిపడా కరెంటు ఉన్నదని, ఆంధ్రప్రదేశ్ కరెంటు కోతలతో ఆగమవుతున్నదని చెప్పారు. సాగు అవసరాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ కరెంటును తెస్తుంటే రైతులు బాగుపడడం చూడలేని రేవంత్రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సాగుకు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పిన రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయానికి నిరంతర కరెంటుపై రైతులు, రైతు సంఘాల నేతలు ఊరూరా చర్చకు పెడుతున్నారని, కాంగ్రెస్ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడుతున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల్లో రైతుల కోసం ఏం చేస్తున్నారో రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండు చేశారు. ఛత్తీస్గఢ్లో ఎంతసేపు కరెంటు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆ రాష్ట్రంలో ఒక రైతు నుంచి 10 క్వింటాళ్ల వడ్లు మాత్రమే ప్రభుత్వం కొంటున్నదని, మిగిలినవి తక్కువ ధరకు అమ్ముకోవాలని పేర్కొన్నారు. సాగుకు సరిపడా నీళ్లు, కరెంటు ఇచ్చి రైతులకు పెట్టుబడి సమకూర్చి మొత్తం పంటను కొనుగోలు చేసేది దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక్కరే రైతుల గురించి పట్టించుకుంటారని, కాంగ్రెస్కు రైతులు అంటే ఎప్పుడూ చులకన భావమేనని అన్నారు. సాగుకు మూడు గంటల కరెంటు సరిపోతుందనే రేవంత్రెడ్డి ప్రకటనపై క్షమాపణలు చెప్పేదాక ఊరూరా రైతులకు అవగాహన కల్పిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.