కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ ఇచ్చిన ప్రకటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ‘సెప్టెంబర్ 26న అడిషనల్ సెక్రెటరీ, జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ వికాస్ షీల్.. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా రెగ్యులేటరీ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరచిన తెలంగాణకు అక్టోబర్ 2న అవార్డును బహూకరిస్తున్నామని, మీ అధికారులను పంపించాలని కోరారు. ఇదే విషయాన్ని నేను, మంత్రి హరీష్ రావు కలిసి మీడియాకి చెప్పాం. ఇందులో తప్పేముంది?’ అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
గ్రామీణ గృహాలకు మిషన్ భగీరథ ద్వారానే నీటి సరఫరా చేస్తున్నామని చెప్పిన ఆయన.. గ్రామీణ గృహాల నీటి సరఫరాకు అవార్డు ఇస్తే, మిషన్ భగీరథకు ఇచ్చినట్లు కాదా? అని అడిగారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ తన అభ్యంతరాలను లేవనెత్తిన లెటర్లోనే మిషన్ భగీరథ పథకాన్ని సమీక్షించామని చెప్పింది కదా అన్నారు. ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు అనడం ఆశ్చర్యంగా ఉందన్న ఆయన.. ‘కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ అబద్దమా? లేక జల్ శక్తి మిషన్ అబద్దమా?
ఇప్పుడేమో అలా నీటిని సఫరా చేస్తున్నట్లు గ్రామ పంచాయతీలు తీర్మానించలేదని కొత్త మెలిక పెడుతున్నారు. అలాంటప్పుడు 100 శాతం నల్లాల ద్వారా మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వాళ్ల వెబ్ సైట్లో ఎందుకు పెట్టారు? ఒక బాధ్యతాయుత మంత్రిత్వ శాఖ ఇలా ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవాలు గ్రహిస్తున్నారు. అబద్ధాలు పదే పదే చెప్పినంత మాత్రాన నిజాలు కావని గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు.