వరంగల్: రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రధానమైన పథకాల్లో తెలంగాణకు హరితహారం (Haritha Haram) ఒకటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలిని, నివాస యోగ్యమైన ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాదని చెప్పారు. ఇలా ఆలోచించటంతోపాటు ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వామ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే (CM KCR) దక్కిందన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి, వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగిన హరితోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2015-21 మధ్య రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85 శాతం పెరిగిందన్నారు. ఇది 3 లక్షల 36 వేల ఎకరాలకు సమానమని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగిందని తెలిపారు.
ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 273 కోట్ల 33 లక్షల మొక్కలు నాటామని, 14 వేల 864 నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2 వేల 11 బృహత్ ప్రకృతి వనాలు, లక్షా 691 కిలో మీటర్ల మేర రహదారి వనాలు ఏర్పాటుచేశామని తెలిపారు. హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా రూ.10,822 కోట్లు ఖర్చుచేశామని వెల్లడించారు. 13 లక్షల 44 వేల ఎకరాల అటవీ పునరుద్ధరించామని, లక్షా 40 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తిచేశామని, 24 కోట్ల 53 లక్షల మొక్కలు నాటామన్నారు. అటవీ పునరుద్ధరణ ద్వారా 53 కోట్ల 84 లక్షల మొక్కలు పెరిగాయని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా నగరాలకు సమీపంలో 75 వేల 740 ఎకరాల్లో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు అభివృద్ధి చేశామని వెల్లడించారు. 164 హరితవనాల్లో వంద శాతం పచ్చదనం సాధించేందుకు లక్షా 71 వేల ఎకరాల్లో 1.6 కోట్ల మొక్కలు నాటామన్నారు. దీంతో హరిత హారాని అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయని చెప్పారు. ఐక్యరాజ్య సమితి, నీతి ఆయోగ్ అభినందించాయన్నారు. అత్యధిక జీవవైవిధ్యం గల నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని తెలిపారు.
వరంగల్ జిల్లాలో 2015 నుంచి 2022 వరకు జరిగిన హరితహర కార్యక్రమం ద్వారా 2.11 కోట్ల మొక్కలు నాటామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా 88 వేల 860 మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు. 2023లో జిల్లా వ్యాప్తంగా 25.95 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారన్నారు. జనగాం జిల్లాలో 2016 నుంచి ఇప్పటివరకు 4.20 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు.