దేవరుప్పుల, ఏప్రిల్ 10 : మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక స్వావలంబన సాధించడమే సర్కారు లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పుల, కొడకండ్లలో సోమవారం కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ పేదరిక నిర్మూలనా సంస్థ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు కుట్టుమిషన్లో శిక్షణనిచ్చి వారిని అనేక రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని చెప్పారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.5.1 కోట్ల వ్యయంతో పాలకుర్తి నియోజకవర్గంలోని మండలాలను ఎంపిక చేసి 3 వేల మంది మహిళలకు మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్టు తెలిపారు. శిక్షణ పూర్తయిన వారిలో అర్హులకు వరంగల్, కొడకండ్లలో చేపట్టిన టెక్స్టైల్ పార్కుల్లో ఉద్యోగాలు ఇస్తామని వివరించారు. మొదటి విడుత విజయవంతంగా ముగియడంతో రాష్ట్రమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని సీఎం ఆదేశించారని, త్వరలో అన్ని జిల్లాల్లో కుట్టుశిక్షణ ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. అనంతరం కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు అందజేశారు.