జనగామ : విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) అన్నారు. బుధవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లింగాల ఘనపూర్ మండలం నేల పోగుల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన, మన ఊరు – మన బడి లో చేపట్టిన పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు నిధులు మంజూరు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలల్లో పిల్లలను చేర్పించాలని సూచించారు. బండి సంజయ్, రేవంత్రెడ్డి తుపాకీ రాముడిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్(CM KCR) మంత్రి కేటీఆర్(KTR)పై ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని వారి మాటలను పట్టించుకోవద్దని సూచించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మితే నట్టేట మునిగినట్లేనని పేర్కొన్నారు.
ఉమ్మడి పాలనలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని విశ్లేషించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ జీవితంలో ఇద్దరు ముఖ్యమంత్రులే నచ్చుతారని వారిలో ఒకరు ఎన్టీఆర్, మరొకరు సీఎం కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ మనసున్న మహారాజు అని పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.