Minister Dayakar Rao | తెలంగాణ పల్లెల్లోని ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం బిందె పట్టుకొని వీధుల్లోకి రావొద్దనే గొప్ప సంకల్పంతో మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మహమూబాబద్ జిల్లా అబ్బాయపాలెంలోని ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రం వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి నాణ్యతను పరిశీలించి, నీటి శుద్ధి తీరు, నాణ్యతా ప్రమాణాలను వివరించారు.
అనంతరం మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధి చేసిన జలాలను అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని తెలిపారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 1996లో పూర్తి చేసిన సిద్దిపేట సమగ్ర తాగునీటి పథకమే మిషన్ భగీరథకు స్ఫూర్తి అని తెలిపారు. పథకం తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్లు అందుతున్నాయన్నారు. 56వేల కిలోమీటర్ల పైపులైన్ వేసి నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మంచినీటి కోసం చేదబావులు, బోర్లు, చెలిమలు, వ్యవసాయ బావులు, మినీ పీడబ్ల్యూఎస్ స్కీములు, పీడబ్ల్యూఎస్ పథకాలు వాడకంలో ఉండేవన్నారు.
ఎండాకాలం నీటి ఎద్దడి విపరీతంగా తాగునీటికి కొరత ఏర్పడేదని, నీటి కొరతతో చాలా దూరం ప్రయాణించి నీటిని తెచ్చుకునేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారానికి దూరదృష్టితో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టిందన్నారు. కృష్ణా, గోదావరి నీటితో నిరంతరం నీటి లభ్యత రిజర్వాయర్ల నుంచి ఉపరితల నీటిని శుద్ధిచేసి క్లోరినేషన్ చేసి ప్రతి చివరి గ్రామం వరకు నీటి సరఫరాకు ప్రణాళికలు చేపట్టడం జరిగిందన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాల్లో 399 పాత ఓహెచ్ఎస్ఆర్లను అనుసంధానం చేయడంతో పాటు కొత్తగా 1166 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించినట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు మున్సిపాలిటీలకు, 120 రెసిడెన్షియల్ స్కూల్స్కు, 80 రైతు వేదికలకు, 895 స్కూళ్లకు, 1269 అంగన్వాడీలకు, 76 ఆరోగ్య సబ్ సెంటర్లకు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా స్థలాలకు సైతం మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.