Minister Dayakar Rao | పత్రిపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దర్దేపల్లి-కొండాపూర్ గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని బృందావన్ గార్డెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి అభివృద్ధికి ఎంతైనా ఖర్చు చేస్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.150కోట్లకుపైగా ఖర్చు చేశామని, మరో రూ.100కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.100కోట్లు ఖర్చు చేస్తానన్నారు. త్వరలో పాలకుర్తిలో డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పాలకుర్తి అభివృద్ధి చెందుతోందని, కేసీఆర్ హయాంలోనే పురాతన ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు కుళ్లుకుంటున్నాయని, వాటిని ప్రజలు గుర్తించాలన్నారు. గతానికి, ప్రస్తుతం జరిగిన అభివృద్ధిని విశ్లేషించుకోవాలని, విమర్శలు తప్పికొట్టి సీఎం కేసీఆర్కు అండగా నిలువాలన్నారు. బీసీ కులవృత్తులు చేసుకునే వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, త్వరలోనే అర్హులను గుర్తించి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాలు అవసరం ఉందని, నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు.
కార్యకర్తలు, ప్రజలే తన బలం, బలగమన్న మంత్రి.. కష్ట సుఖాల్లో అందరికీ అండగా ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు, అభివృద్ధిని చూసి రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయని, మనమంతా కేసీఆర్ను ఆశీర్వదించి.. బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మంత్రి పోచమ్మ దేవాలయ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఓ దాత ఇచ్చిన విరాళానికి తోడుగా తన వంతు సాయం అందిస్తానని ప్రకటించారు. అలాగే పాలకుర్తిలో గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉషా దయాకర్రావు పాల్గొన్నారు.