Minister Dayakar Rao | దేవరుప్పుల : ‘ఊరుకు ఒకరిద్దరు చెడగొట్టుడుగాళ్లుంటరు. వాళ్లను కాంగ్రెస్ జమానాలో ఏం చేసిండ్రో నిలదీయాలి’ అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరులో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని, ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయన్నారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ నాయకులు ఊళ్ల ఉన్న చెడగొట్టుడుగాళ్లతోని రచ్చబండ పెట్టాలె, నిలదీయాలన్నారు. మనం చేసింది చెప్పుకోలేక పోతున్నమని, తెలంగాణ వచ్చినంక, ఉమ్మడి రాష్ట్రంతోని పోల్చితే ఆస్మాన్ ఫరక్ అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను గ్రామాల్లో ప్రచారం చేయాలని, ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పాలని శ్రేణులకు సూచించారు. ఇన్నాళ్లూ చేసిన అభివృద్ధిని నెమరువేసుకోవడంతో పాటు పార్టీ పటిష్టతకు శ్రేణులు కృషి చేయాలన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు తగిన సమయంలో గుర్తింపు ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రతి పక్షాలు గ్రామాల్లో తుడిచిపెట్టుకుపోయాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి మనమే తిరుగులేని శక్తిగా ఎదిగేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.