వరంగల్ : విస్నూర్ రామచంద్రారెడ్డి, తల్లి జానమ్మ ఆగడాలకు వ్యతిరేకంగా.. ఉద్యమం ద్వారా ముచ్చెమటలు పట్టించిన యోధుడు నల్ల నరసింహులు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు జయంతి సందర్భంగా హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నర్సింహులు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ. దొరలు, దేశ్ముఖ్లు, రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి పోరాడిన గొప్ప వ్యక్తి నర్సింహులు అన్నారు. తనను అనేకమార్లు జైలులో వేసినా తన పోరాటాన్ని వీడని మహనీయుడు..నల్ల పులిగా పేరుగాంచారని ప్రశంసించారు. నల్ల నరసింహులు చేసింది వ్యక్తుల పోరాటం కాదు, వర్గ పోరాటం. ఆయన త్యాగాలు యావత్ తెలంగాణ ప్రజలందరు మరువలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.