రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, చామకూర మల్లారెడ్డి, పలువురు అధికారులు
మరింత పడక్బందీగా ఉపాధి హామీ పనులను నిర్వహించాలని, మరిన్ని పనులు చేపట్టాలని, కేంద్రం ఉపాధి హామీ నిధుల్లో 25వేల కోట్ల కోత పెట్టినందున, ప్రస్తుతం నిర్వహించే, ఇంకా చేపట్టనున్న పనులన్నింటికీ సరిపడా నిధులు రాబట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్లోని జిల్లా పరిషత్లో నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి పేషీలో ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, చామకూర మల్లారెడ్డి, నామినేటెడ్ సభ్యులు సద్గుణ రవిందర్, అందె యాకయ్య, వెంకటనారాయణ గౌడ్, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, ఇరిగేషన్ అడిషనల్ సెక్రటరీ శంకర్, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, ఈఎన్సీ సంజీవరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్, సలహాదారు కొండల్ రావు, సొషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు గత ఏడాది చేపట్టిన పనులను సమీక్షించారు. తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోనే అత్యధిక పని దినాలు, అత్యధిక మెటీరియల్ కాంపొనెంట్ను వినియోగించుకుని ఉపాధి హామీ పనుల్లోనూ మనమే నెంబర్ వన్ గా నిలిచామన్నారు. నిర్ణీత పనిదినాల కంటే అధికంగా చేపట్టామన్నారు. పల్లె ప్రగతి ద్వారా పల్లెల రూపు రేఖలనే మార్చేసి అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామన్నారు. కరోనా కష్ట కాలంలో పట్టణాల నుంచి గ్రామాలకు వలస పెరిగిందని, తదనుగుణంగా పనులు, ఉపాధి కల్పించిన ఘనత కూడా మనదేనన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి 25 వేల కోట్ల మేరకు కోత విధించిందని తెలిపారు. అయినా సరే, ఉపాధి హామీ పనులు మరింతగా చేపట్టి, ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టడానికి అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలోని 32 జిల్లాలు, 540 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం అమలులో ఉంది. రాష్ట్రంలో 57 లక్షల 15 వేల జాబ్ కార్డులు 1 కోటి 23 లక్షల కూలీలకు జారీ చేశాం. 2021-22 లో 28 లక్షల 3 వేల కుటుంబాలకు చెందిన 47 లక్షల 3 వేల కూలీలకు పని కల్పించడం జరిగింది. ఒక లక్ష 54 వేల కొత్త జాబ్ కార్డులు 3 లక్షల 17 వేల కూలీలకు జారీ చేయడమైనది. 13 కోట్ల 75 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను 13 కోట్ల 85 లక్షల పనిదినాలు కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా 50 లక్షల పని దినాలకు ఆమోదం తెలిపిందని మంత్రి దయాకర్ రావు వివరించారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కల్లాలు, గ్రామ నర్సరీలు చేపట్టాం. హరితహారం కింద కోట్లాది మొక్కలు నాటి, 95 శాతం మొక్కలను సంరక్షించి, 7 శాతం గ్రీనరీని సాధించగలిగామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.