న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలోని లొట్లబండ తండా, తొర్రూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బోర్లు, బావులకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని, గొంతులో ప్రాణం ఉండగా అది జరుగదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారని పేర్కొన్నారు. మన పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్లోని రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయాలని మన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏటా వేల కోట్ల నష్టం వచ్చినా రైతులు ఆర్థికంగా నష్టపోవద్దనే సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారని గుర్తుచేశారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం
రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ మండలం మన్యంకొండ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని కోటకదిర పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొంటున్నామన్నారు. గతంలో కరువుతో అల్లాడిన పాలమూరు రైతులు ఇప్పుడు ఏడాదికి మూడు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
ప్రతి గింజనూ కొనేది ఒక్క తెలంగాణే
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్, కమాన్పూర్, ఎలగందుల, ఖాజీపూర్, ఆసీఫ్నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి గంగుల మాట్లాడుతూ.. ప్రతి గింజనూ కొనేందుకే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. రైతులు నిర్ణీత ప్రమాణాల మేరకు ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. రైస్మిల్లర్లు, సెంటర్ల నిర్వాహకులు తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.