హనుమకొండ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వచ్చిన ఈ స్వాతంత్య్ర వేడుక ప్రత్యేకమైనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 22 వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని సూచించారు.
వజ్రోత్సవాల్లో భాగంగా వాడవాడలా జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాలని చెప్పారు. స్వతంత్ర స్ఫూర్తిని చాటిచెప్పేలా గ్రామ గ్రామాన, వాడవాడలా.. వజ్రోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. స్వతంత్ర భారత ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలన్నారు. మంగళవారం నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవాల్లో పాల్గొనాలన్నారు.