Minister Errabelli Dayakar Rao | బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. రాజకీయ వికృత క్రీడకు తెరలేపుతోందని, దాన్ని ఛేదిస్తూనే సీఎం కేసీఆర్ సర్వమత సామరస్యాన్ని పాటిస్తున్నారని పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరఫున తొర్రూరు, పెద్ద వంగర, రాయపల్లి మండలాల్లో ముస్లింలకు కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ విద్వేషాలను పెంచే ప్రయత్నం చేస్తున్నా హిందూ ముస్లింలంతా కలిసిమెలసి ఉంటున్నారన్నారు.
సర్వమత సామరస్యాన్ని తెలంగాణ చాటిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతిని కేసీఆర్ మొదలుపెట్టారన్నారు. ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం ఎనిమిదేళ్లలో వేల కోట్ల ఖర్చు చేసిందన్నారు. రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ.. ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు 5లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,00,116 సహాయం షాదీ ముబారక్ పథకం ద్వారా అందజేస్తున్నదన్నారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి రూ.40కోట్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. తెలంగాణ వర్ఫ్ బోర్డు సంస్థలో నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.53 కోట్ల గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా ఉర్దూ అకాడమీ నిర్వహణకు రూ.40కోట్లు కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ముస్లిం పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముస్లింలు పాల్గొన్నారు.