హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, రాష్టాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ దేశానికి అవసరమని ప్రజలంతా భావిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని కోరుకుంటున్నారని, కేసీఆర్ వస్తేనే దేశం బాగుపడుతుందని అంటున్నారని.. కేసీఆర్తో కాంగ్రెస్, బీజేపీల పీడ విరగడ అవుతుందని భావిస్తున్నారన్న ఎర్రబెల్లి.. అందుకే టీఆర్ఎస్ను జాతీయ స్థాయికి విస్తరించారన్నారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తిలోని పెద్దవంగర మండల తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ చిచ్చులు పెడుతున్నారని, వాటిని ప్రజలంతా తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలువుతున్నాయా? అనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ వచ్చేక పెద్ద వంగరకు తగిన గుర్తింపు, గౌరవం దక్కాయన్నారు. రూ.కోటి వ్యవయంతో తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని, ఎంపీడీవో కార్యాలయాన్ని ఇక్కడే నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పెద్ద వంగర మండలంలోని 107 డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకు రూ.6కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలను చెక్ను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.