Minister Dayakar Rao | సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలం చెరువుముందు తండాలో కొత్త గ్రామ పంచాయతీ భవనం, ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మరిన్ని సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు తండాకు వచ్చిన మంత్రికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు చెరువుముందు తండాలో రూ.కోటి విలువైన పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా మరో రూ.కోటి విడుదల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజనులు తండాలు, గూడాల్లో స్వయం పాలన కోసం ఉద్యమిస్తే గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలోని 3,146 తండాలను, గూడాలను పంచాయతీలుగా మార్చారన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం రూ.5లక్షల నిధులు అందుతున్నాయన్నారు. ఇవాళ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు సైతం అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, దాంతో ప్రజలు మెరుగైన జీవనం కొనసాగించే అవకాశం వచ్చిందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునే వీలు కలిగిందన్నారు. అనేక పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయన్నారు. ప్రజలు బీఆర్ఎస్ నేతృత్వంలోని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలనలో సుఖ సంతోషాలు, శాంతి సౌఖ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.