Minister Errabelli Dayakar Rao | నర్సంపేట : పంట నష్టంపై ప్రతిపక్షాలు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. అధికార దాహంతో అన్నదాతను వదలకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో గతేడాది అకాల వర్షాలకు మొక్కజొన్న, మిరప పంట నష్టపోయిన రైతులకు రూ.8.89కోట్ల విలువైన పరిహారం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు పరిహారం ఇస్తున్నారా? తెలంగాణ తరహా పతకాలు అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. రైతుల కోసం మొసలి కన్నీరుకారుస్తున్న ప్రతిపక్ష పార్టీల వైఖరిని, దివాళాకోరుతనాన్ని ప్రజలు గుర్తించారన్నారు. కేంద్ర ప్రభుత్వం పంట పొలాలకి మీటర్లు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతుంటే, రైతుబంధుతో ఆదుకుంటున్నది మన తెలంగాణ ప్రభుత్వమేననన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటలు నష్టపోతే సర్వే చేసి నష్ట పరిహారం ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. అక్కడ ఇవ్వరు కానీ, ఇక్కడ మాత్రం ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికో నీతి.. ప్రాంతానికో నీతి ఉంటుందా? అంటూ విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్టం నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కువగా జరిగింది అన్నారు. అధికారులు ఈ సారి నష్టపోయిన పంటలను సర్వే చేసి నివేదికల అందిస్తారని, ఆ నివేదికలు రాగానే రైతులను కచ్చితంగా ఆదుకుంటామన్నారు.
ఈ రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ నర్సంపేటకు వచ్చి నష్టపోయిన పంటలను పరిశీలించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నష్టపోయిన రైతుల పక్షాన నిలబడి పంటలను సర్వే చేస్తున్నారన్నారు. రైతు నష్ట పోకూడదని పంట కొంటున్న ప్రభుత్వం మనదని, నష్ట పోయిన రైతులను సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.