కరీంనగర్ : బీజేపీతోనే దేశం నాశనం అవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 3 కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీజేపీ ఒక మతతత్వ పార్టీఅని, ఆ పార్టీ నాయకులు దుర్మార్గులు, దొంగలని మండి పడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఎన్కట తుపాకి వెంకట్రామడి మాటల్లా ఉన్నాయని ఎద్దేవ చేశారు. కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా తేలేదని అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీజేపీ వాళ్లు మాత్రం దేశాన్ని నాశనం పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్,మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, స్థానిక సర్పంచ్ వీర్ల సరోజన, వెలిచాల సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.