హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్భగీరథ కార్యక్రమంతో రాష్ట్రంలో మంచినీటి సమస్య తీరిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రం నయా పైసా ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం నిధులు ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, అది నిజమని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. నిరూపించలేకపోతే కిషన్రెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. మిషన్ భగీరథ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, మిషన్ భగీరథ స్పెషల్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి రంగంలో సాధించిన విజయాలపై రూపొందించిన బుక్లెట్ను మం త్రులు ఆవిషరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. మారుమూల తండాలు, గూడేలలో కూడా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామని, నడి వేసవిలో సైతం ఎక్కడా తాగునీటి సమస్య లేదని చెప్పారు. ఏ ఆడ బిడ్డ కూడా మంచి నీళ్ల కోసం బిందె పట్టుకొని వీధుల్లోకి రావద్దనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం రూపొందించారని తెలిపారు.
నాడు ఊళ్లల్లో 17 వేల ట్యాంకులు ఉంటే.. నేడు పాత వాటికి అదనంగా 19 వేల కొత్త ట్యాంకులు నిర్మించినట్టు వెల్లడించారు. నాడు ఇండ్లకు 10 లక్షల కనెక్షన్లు ఉంటే.. నేడు కొత్తగా ఇండ్లకు 47 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. నాడు గ్రామాల్లో అంతర్గత పైప్లైన్లు 11 వేల కిలో మీటర్లు ఉంటే నేడు కొత్తగా 56 వేల కిలోమేటర్లు వేశామని తెలిపారు. నాడు రోజుకు ఒకొకరికి సగటున 20 లీటర్ల నుంచి 40 లీటర్ల తాగునీరు మాత్రమే అందించేవారని, నేడు రోజుకు ఒకొకరికి సగటున గ్రామాల్లో 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో 150 లీటర్ల చొప్పున మంచినీటిని సరఫరా చేస్తున్నామని ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని కొనియాడారు.
విజన్ ఉన్న నేత సీఎం: మహమూద్ అలీ
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజూ ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. కేసీఆర్ దూరదృష్టికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 65 ఏండ్లలో చేయని అభివృద్ధిని 10 ఏండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
దమ్మున్న నేత కేసీఆర్: తలసాని
ఇంటింటికీ నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. జంట నగరాల ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. ఒక విజన్ ఉన్న నాయకుడు పాలకుడైతే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ఖాళీ బిందెలు, వాటర్ ట్యాంకులు మాయమైనయ్: ప్రశాంత్రెడ్డి
నూరేండ్లపాటు నీటి సమస్యలు రాకుండా ప్రణాళికలు రూపొందించి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, మంచినీళ్ల పండుగను జరుపుకునే హక్కు తెలంగాణ సమాజానిదని, అంతటి పవిత్ర కార్యాన్ని కార్యసాధకుడు కేసీఆర్ సాధించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఖాళీ బిందెలు, వాటర్ ట్యాంకులు మాయమైనయని పేర్కొన్నారు. ప్రతీ ఒకరికి స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిననది జలాలను తాగడానికి అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని, ఇప్పుడు తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచి నీళ్ళు అందుతున్నాయని చెప్పారు. ప్రతిరోజూ 50 నీటిశుద్ధి కేంద్రాల్లో, 75 ప్రయోగశాలల్లో నీటి నాణ్యతను నిశితంగా పరిశీలించిన తర్వాతే ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మంచినీళ్లు సరఫరా చేస్తున్నామని వివరించారు.
దేశంలో నీళ్ల చరిత్ర సృష్టించిన తెలంగాణ: మంత్రి మల్లారెడ్డి
దేశంలో నీళ్ల చరిత్ర సృష్టించేందుకే సీఎం కేసీఆర్ ఇంజినీర్ అవతారమెత్తారని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. ఎండల్లో కూడా చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు వాడిన చెరువుల చరిత్ర.. నేడు నిండిన చెరువుల చరిత్రను చెప్పుకుంటున్నామని తెలిపారు. జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి కారణం నీళ్లేనని వివరించారు. ఐటీ, పుశు పోషణ, చేపలు, వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతితోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధికి కారణం నీళ్లేనని చెప్పారు. నదుల నీటిలో పీహెచ్ 7.5 ఉన్నందున భూమిపై ఉన్న సమస్త జీవులకు మేలు జరిగే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద ఇప్పటివరకు రూ.32,959 కోట్లు విడుదల చేయగా, తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు. 30 శాతం పనులు కూడా పూర్తి కాని ఉత్తరప్రదేశ్కు రూ.6,300 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.2,820 కోట్లు, రాజస్థాన్కు రూ.2,749 కోట్లు, గుజరాత్కు రూ.2,692 కోట్లు ఇచ్చింది. తెలంగాణకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ చెల్లని రూపాయి కూడా ఇవ్వలేదు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు