గోవిందరావుపేట, జనవరి 10: ‘అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఇంటి పెద్దగా నేనుంట. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం వారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన మలివిడత ఉద్యమకారుడు మల్లికార్జున్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్, సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమంలో మల్లికార్జున్ స్వరాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు 11 ఏండ్లపాటు చెప్పులు ధరించలేదని తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మృతుడి కుమారుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు మరో కుమారుడికి ఉన్నత విద్య అందించేలా కృషి చేస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మల్లికార్జున్ కుటుంబానికి తనవంతుగా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. మల్లికార్జున్ కుటుంబాన్ని మాజీ ఎంపీ సీతారాంనాయక్ పరామర్శించారు.