దేవరుప్పుల/పాలకుర్తి రూరల్, నవంబర్ 6: ప్రజల ఆశీర్వాదంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, సీఎం కేసీఆర్ దీవెనలు, ప్రజాబలంతో మరోసారి విజయం సాధిస్తానని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నామినేషన్ పత్రాలతో ఆలయాల్లో పూజలు, చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జనగామ జిల్లా పాలకుర్తిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ నెల 10న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తానని, దానికి మంత్రు లు హరీశ్రావు, సత్యవతి రాథోడ్ తదితరులు హాజరవుతారని చెప్పారు. 14న తొర్రూరులో కేసీఆర్ సభ ఉంటుందని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ సహకారంతో గోదావరి జలాలతో చెరువులు నింపానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు రామసహాయం కృష్ణకిషోర్రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.