Minister Dayakar Rao | సీఎం కేసీఆర్తోనే తెలంగాణ పల్లెలు సమగ్రాభివృద్ధి సాధించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల కేంద్రం పంచాయతీలకు జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటించిన 46 అవార్డుల్లో రాష్ట్రానికి చెందిన పలు పల్లెలు 13 అవార్డులను గెలుచుకున్నారు. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఢిల్లీలో జరగ్గా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
ఎనిమిది దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, ఐదు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను రాష్ట్రపతి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్శాఖ అధికారులు అందజేశారు. తొమ్మిది కేటగిరిల్లో అవార్డులు ప్రకటించగా.. ఇందులో తెలంగాణకు ఎనిమిది కేటగిరిల్లో అవార్డులు దక్కించుకోవడంపై రాష్ట్రపతి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలంగాణలో జరుగుతున్న పల్లె ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై వివరించారు. దేశంలో తెలంగాణ మాత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా నిధులు ఇస్తున్నదని చెప్పారు. పల్లెల్లో వినూత్న ప్రగతిని సాధించామన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అలాగే అవార్డులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంతో పాటు అవార్డులు వచ్చేందుకు కారణమైన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనా పథంలో పని చేస్తూ.. దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపాలని, అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణను మరింత సమున్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.