కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : బీజేపీతోనే దేశం నాశనమవుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఎన్కట తుపాకీ వెంకట్రాముడి మాటల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఇప్పటివరకు పైసా తెచ్చి అభివృద్ధి చేసింది లేదని తూర్పారబట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ.1.21 కోట్లతో నిర్మించిన పలు కుల సంఘాల భవనాలు, వంతెనను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశాలు ఇచ్చిందని మండిపడ్డారు. మోదీ చెప్పినట్టు మీటర్లు పెడితే ఒక్కో రైతు ఏడాదికి రూ.లక్ష చొప్పున కరెంట్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
ఇప్పుడు తెలంగాణ ఎట్లున్నదో
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. 2001కి ముందు తెలంగాణ ఎట్లున్నది? ఇప్పుడు ఎట్లున్నది? ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ భూగర్భంలో 500 టీఎంసీల నీళ్లు ఇంకాయని, ఇంకా మూడేండ్లపాటు వర్షాలు పడకపోయినా తెలంగాణలో నీళ్లకు కరువు ఉండదన్నారు. సీఎం కేసీఆర్ అప్పులు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, అప్పులు తెచ్చి ఉద్యోగుల జీతాలు ఇస్తున్నామా? ఆసరా పెన్షన్లు ఇస్తున్నామా? అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కిందికి వస్తుందని వివరించారు. బీజేపీ నాయకులు కాళ్లల్లో కట్టె పెడుతున్నారని, అభివృద్ధి జరుగుతున్న రాష్ర్టాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంపై బీజేపీ వాళ్లు చేస్తున్న ఆరోపణలు దుర్మార్గమైనవని, అనాలోచితమైనవని ధ్వజమెత్తారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.