హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి దీవకొండ దామోదర్ రావుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దామోదర్ రావును శాలువాతో సత్కరించారు.
రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బీ పార్థసారథిరెడ్డి, గాయత్రి గ్రానైట్ సంస్థ వ్యవస్థాపకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ని ముఖ్యమంత్రి ఎంపికచేసి బీ-ఫామ్స్ అందించారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలుకు గురువారమే తుది గడువు. ఆ స్థానానికి వద్దిరాజు రవిచంద్రను ఎంపిక చేశారు. ఆయన నేడు నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీ శ్రీనివాస్ పదవీకాలం జూన్ 21తో ముగియనుండటంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా దీవకొండ దామోదర్రావు, పార్థసారథిరెడ్డి ఎంపికయ్యారు.