హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్ను నక్సలైట్లు గ్రేనెడ్లతో పేల్చివేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ డిమాండ్ చేశారు. రేవంత్ చేసిన అసాంఘిక వ్యాఖ్యలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవంత్రెడ్డి లాంటి ఐరన్లెగ్ను పీసీసీ అధ్యక్షుడిగా పెట్టుకున్నప్పటి నుంచే కాంగ్రెస్ ఖతమైపోయిందని ఎద్దేవా చేశారు. బుధవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖతం అయిందని, ఇప్పుడా పరిస్థితి కాంగ్రెస్కు వచ్చిందని చెప్పారు. రేవంత్రెడ్డి సినిమాల్లో ఐటమ్సాంగ్ లాంటివాడని ఎద్దేవా చేశారు. తానొక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అనే విషయాన్ని విస్మరించి జోకర్లా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి చేసేది పాదయాత్ర కాదని, పాదయాత్ర అంటే కొద్దిసేపు నడిచి చాలాసేపు కారులో ప్రయాణించడం కాదని చురకలేశారు. ములుగులో పాదయాత్ర, నర్సంపేటలో కారు యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. తనకు చదువు రాదంటూ రేవంత్ సంస్కారహీనంగా మాట్లాడారని, తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా మొత్తం ఏడుసార్లు గెలిచానని చెప్పారు. రేవంత్పై కాంగ్రెస్ పెద్దలే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆ పార్టీకే నష్టమని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తున్నదని దీనిని రేవంత్ సమర్థిస్తారో? వ్యతిరేకిస్తారో? చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి పాదయాత్రకు ప్రజాదరణ లేదని, ఆయనవెంట ఉన్నది గూండాలేనని ధ్వజమెత్తారు.
రేవంత్రెడ్డి నక్సలైట్ల భుజంమీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారని మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. స్థాయిలేనివాడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఇట్లానే ఉంటుందని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయ న పాదయాత్ర మానుకోట దాటదని హెచ్చరించారు. రేవంత్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సీతక్క సమర్థిస్తున్నా రా? వ్యతిరేకిస్తున్నారా? చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు రూపొందించిన ప్రగతిభవన్ను పేల్చాలని నక్సలైట్లకు రేవంత్ పిలుపు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించారు.
రేవంత్రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే నైతిక హక్కులేదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ప్రగతిభవన్ను పేల్చివేయాలని నక్సలైట్లకు పిలుపునివ్వ డం దుర్మార్గమని మండిపడ్డారు. నక్సలైట్లపై నిషేధం విధించింది కాంగ్రెస్యేనన్న విషయాన్ని రేవంత్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు.