హనుమకొండ: టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాతోనే కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదేస్ఫూర్తితో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపి ప్రభుత్వం మెడలు వంచి విజయం సాధించిన రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు. పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని మరిచి, కార్పోరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చిందని, వాటికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసిన రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని కోరేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను సీఎం కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా బీజేపి, కాంగ్రెస్ నాయకులు బుద్ది తెచ్చుకొని తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని సూచించారు.