IPL 2026 : ఐపీఎల్ ఆరంభానికి ముందే పలు ఫ్రాంచైజీలకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. పలు జట్లకు చెందిన కీలక ఆటగాళ్లు గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు సైతం అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రధాన పేసర్ జోష్ హేజిల్వుడ్ కొన్ని మ్యాచ్లకు దూరం కానుండగా.. మరో విదేశీ పేసర్ సైతం ఐపీఎల్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. శ్రీలంక ఆటగాడు నువాన్ తుషార (Nuwan Tushara)కు ఆ దేశ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వకపోవడమే అందుకు కారణం.
పంతొమ్మిదో సీజన్లో ఆర్సీబీని పేసర్ల కొరత వెంటాడుతోంది. గాయం నుంచి కోలుకుంటున్న ప్రధాన పేసర్ జోష్ హేజిల్వుడ్ కొన్ని మ్యాచ్లకు దూరం కానుండగా.. కేసులో ఇరుక్కున్న యశ్ దయాల్పై ఫ్రాంచైజీ వేటు వేసింది. ఈ పరిస్థితుల్లో మరో పేసర్ నువాన్ తుషార మెగా టోర్నీలో ఆడడంపై ఇంకా స్పష్టత రాలేదు. శ్రీలంక బోర్డు అతడికి ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో, తుషార ఈ సీజన్కు అందుబాటులో ఉండడంపై సందేహాలు నెలకొన్నాయి.
🚨 BIG BLOW FOR RCB CAMP !! 🚨
RCB’s Nuwan Thushara 🇱🇰 is set to miss the first two games of IPL 2026. Sri Lanka Cricket (SLC) has reportedly denied his NOC after he failed to clear the mandatory fitness tests qualification
However, he can reappear for the test in 4–5 days,… pic.twitter.com/HAGcfw8TCC
— Indian Cricket Netwrk (@ICN_Updates01) March 27, 2026
శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవల ఫిట్నెస్ ప్రమాణాల విషయంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఎవరైనా సరే ఫిట్నెస్ నిరూపించుకున్నాకే విదేశీ లీగ్స్, ద్వైపాక్షిక సిరీస్లో ఆడేందుకు అనుమతి లభిస్తుంది. తుషార విషయానికొస్తే ఈమధ్య గాయపడలేదు. బౌలింగ్ చేసేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. కానీ, లంక బోర్డు నిర్దేశించిన ఫిట్నెస్ ప్రమాణాలను అందుకోవడంలో మనోడు విఫలమయ్యాడు. దాంతో, అతడికి ఐపీఎల్లో ఆడేందుకు అవసరమైన ఎన్ఓసీ రాలేదు.
అయితే.. శ్రీలంక ఆటగాళ్లు దుష్మంత్ చమీర, దసున్ శనక, పథుమ్ నిశాంక, కమిందు మెండిస్లకు ఎన్ఓసీ లభించింది. బోర్డు నుంచి అనుమతి రావడంతో వీరు ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ మ్యాచ్తో వేసవి క్రీడా వినోదం మొదలవ్వనుంది. తొలి పోరులో ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టనున్నాయి.