రాయపర్తి (వరంగల్) : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. ఈ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని జోస్యం చెప్పారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం ఊకల్లు గ్రామ శివారులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్(Chief Minister KCR) నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ద్వారా సమృద్ధిగా సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు(Kalyana Laxmi ), రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని వివరించారు. రాష్ట్రానికి నయా పైసా ఇవ్వని బీజేపీ నాయకులు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలువాలని కోరారు. మాయ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.