స్టేషన్ఘన్పూర్, ఆగస్టు 7 : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకున్నది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన రైతు మహ్మద్ యాకూబ్ పాషా (40) తనకున్న మూడు ఎకరాల్లో వరి, పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవల రెండు బోర్లు వేసినా నీరు పడలేదు. సాగుతోపాటు కుటుంబ పోషణ కోసం దాదాపు 6 లక్షల వరకు అప్పులయ్యాయి.
ఈ సారి సరైన వర్షాలు లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీరుతాయో తెలియక ఆందోళనకు గురయ్యాడు. గురువారం భార్య ఫర్జాన వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు పోగా, యాకూబ్ పాషా ఇంటి వద్ద గడ్డి మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా చూసిన తల్లి చిన్నకుమారుడితో కలిసి చికిత్స నిమిత్తం 108లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వేణు తెలిపారు.