వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 14: రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న దక్షిణ భారత జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్లు, వైద్యుల సదస్సుకు వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) వేదికగా నిలిచింది. కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ ఫిజీషియన్స్ అసోసియేషన్, కేఎంసీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ గుండయ్య అధ్యక్షతన రెండో దక్షిణ భారత సదస్సు నిర్వహిస్తున్నా రు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
వైద్యులు నడిచే దేవుళ్లని, మనిషి ప్రాణాలను నిలిపేందుకు వారు పడుతున్న శ్రమ ఎంతో గొప్పదని మంత్రి కొనియాడారు. 24 అంతస్తుల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుమారు 1,500 మంది వైద్యులు హాజరై గడిచిన ఏడాదిలో వారి దృష్టికి వచ్చిన అత్యంత అరుదైన విషయాలను అసోసియేషన్ సభ్యులతో పంచుకున్నారు. మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో సుమారు 60 రకాల మెడిసిన్ విభాగాల అంశాలపై వివరణాత్మక, విశ్లేషణాత్మక చర్చలు సాగుతాయని తెలిపారు.
కార్యక్రమంలో కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, కేఎంసీ ప్రిన్సి పాల్ మోహన్దాస్, సదస్సు నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ రమేశ్, కార్యదర్శులు డాక్టర్ వీ చంద్రశేఖర్, డాక్టర్ రాజారావు, కోశాధికారి డాక్టర్ పవన్కుమార్, డాక్టర్ త్రిలోక్ చందర్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ హెచ్ చంద్రశేఖర్, డాక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.