మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశం
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): చరిత్రాత్మక జహంగీర్ పీర్, పహాడీ షరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి పనుల కోసం 4 ఎకరాలు సేకరించడంపై త్వరలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. నాంపల్లిలోని అనీసుల్ గుర్బా, చరిత్రాత్మక మకా మసీదులో కొనసాగుతున్న మరమ్మతులపై మంత్రి ఆరా తీశారు. మకామసీదు పనులను నెల రోజుల్లో, అనీసుల్ గుర్బాను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు.
కోకాపేటలో ప్రతిపాదిత క్రిస్టియన్ భవన్, రాజస్థాన్లోని అజ్మీర్లో అషూర్ఖానా నిర్మాణాలపై నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. వక్ఫ్బోర్డు ఆస్తులను లీజుకు ఇచ్చే విషయమై సమగ్ర నివేదిక తయారు చేయాలని చెప్పారు. మైనారిటీ సంక్షేమశాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ల నిర్వహణపైనా సమీక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, కార్యదర్శి అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు.