తొర్రూరు : మిషన్ కాకతీయతో రాష్ట్రంలోని చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమరం, గుర్తూరు చెరువుల వద్ద నిర్వహించిన చెరువుల పండుగలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో తెలంగాణలోని నీటి వనరులను(Irrigation Sources) నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో మిషన్ కాకతీయ(Mission Kakatiya) ద్వారా ఐదువేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 46వేల చెరువులను పునరుద్ధరించడం ద్వారా పూర్వవైభవం తీసుకొచ్చారని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ. 179 కోట్ల ఖర్చుతో 601 చెరువులను, పాలకుర్తి నియోజకవర్గం లో రూ.61 కోట్లతో 331 చెరువులను బాగు చేసినట్లు వివరించారు. దీనివల్ల 119 శాతం భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు.
చెరువుల కింద 150 శాతం పంటల సాగుబడి, దిగుబడి పెరిగిందని వివరించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును రికార్డ్ టైంలో పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. కాళేశ్వరం(Kaleshwaram), దేవాదుల(Devadula), ఎస్సారెస్పీ నీటి ద్వారా ఆఖరి ఆయకట్టుకు సంబంధించిన చెరువులను కూడా నీటితో నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
మత్స్యకారులకు ఉపాధి..
చెరువులను బలోపేతం చేయడంతో పాటు చెరువులను నీటితో నింపడం వల్ల మత్స్యకారులకు ప్రభుత్వం ఉపాధి కల్పించిందని మంత్రి అన్నారు. ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను అందిస్తూ వారిని ఆదుకుంటుందని పేర్కొన్నారు. స్థానికులకు ఆరోగ్యకర చేపలు లభిస్తున్నాయని వెల్లడించారు. చెరువుల పండుగ సందర్భంగా కట్టమైసమ్మలకు, గంగమ్మ తల్లికి పూజలు చేశారు. గ్రామ చెరువుల్లో జాలరులతో కలిసి మంత్రి చేపలు పట్టారు.