హనుమకొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల పరిశ్రమలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ, దశాబ్ది వేడుకలలో(Decade Celebrations) భాగంగా హనుమకొండ జిల్లా మడికొండ పారిశ్రామిక కేంద్రం ఆవరణలో మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని, చిన్నషాపులు జనరేటర్ పెట్టుకుని వ్యాపారం చేసుకునేవారిని అన్నారు. రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్(CM KCR), ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్(Minister KTR) కృషితో పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. భారీగా పెట్టుబడులతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తెలంగాణ యువతకు లభిస్తున్నాయని వివరించారు.
రాష్ట్రంలో మెగా టెక్ట్స్టైల్స్ పార్క్ ఏర్పాటు అద్భుతమైన ప్రాజెక్ట్ అని కొనియాడారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజు, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కలెక్టర్ సిక్త పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.