హైదరాబాద్ : రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రోడ్లను అందంగా, అద్దంలా ఉంచాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాఖను పునర్వవస్థీకరణ వేగవంతం చేయాలని మంత్రి దయాకర్రావు ఆదేశించారు. అధికారాలు, బాధ్యతలను వికేంద్రీకరించి, అవసరమైన పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో పంచాయతీ కార్యదర్శి రఘునందన్రావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావుతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మండలాలు, గ్రామ పంచాయతీలతో కొత్త సర్కిల్స్, డివిజన్ల వారీగా వేయాల్సిన రోడ్లు, అవసరమైన సిబ్బంది కోసం పోస్టుల భర్తీకి 24వ తేదీ సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 19న జరిగిన పంచాయతీరాజ్ ఇంజినీర్స్ వర్క్షాప్లో చర్చించిన రోడ్లకు తక్షణ మరమ్మతులు, నిర్వహణ ప్రతిపాదనలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అత్యవసరమైన పనుల జాబితాను రూపొందించాలని చెప్పారు.
వచ్చే నెల 10 నాటికి రోడ్ల మరమ్మతులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 30లోగా మంజూరు తీసుకొని డిసెంబర్ 15లోగా పనులు ప్రారంభించాలన్నారు. వరద నీటితో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్ల నిర్మాణంలో అటవీ భూముల సమస్యను గుర్తించి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 67వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని, వీటిని అద్దంలా ఉండేలా చూడాలన్నారు. ఇందుకోసం పై నుంచి కిందిస్థాయి వరకు ఇంజినీర్లకు బాధ్యతలు, అధికారాలు ఇవ్వాలన్నారు. శాఖ పునర్వ్యవస్థీకరణకు అవసరమైతే మరో రూ.100కోట్లు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.