పాలకుర్తి : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో పాఠశాలలు బాగుపడుతున్నాయని, ఇందులో ప్రజలు సైతం భాగస్వాములై బాధ్యతత తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా తొర్రూరు మండలం మాటేడు ప్రభుత్వ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవరూ అమలు చేయలేదన్నారు. ఆయనను అందరు కాపాడుకోవాలన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే.. ప్రభుత్వ బడుల్లోనే మంచి బోధన, వసతులు ఉన్నాయన్నారు. డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడమే తన లక్ష్యమన్నారు. సర్కారు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నారన్నారు. మనదగ్గర ఉన్నన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడా లేవన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థినులతో కలిసి స్టేజ్ వద్దే మంత్రి భోజనం చేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రమేశ్, జిల్లా విద్యాధికారి రామారావు, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన అంజయ్య, ఏఎంసీ చైర్మన్ పసుమర్తి శాంత, స్థానిక సర్పంచ్ శ్రీమతి శోభ, ప్రధాన ఉపాధ్యాయులు వేణు మాధవ రెడ్డి, స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.