Minister Dayakar Rao | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. రూ.750కోట్ల భారీ నిధులను ఆడబిడ్డల కోసం విడుదల చేసిన సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిధులలో రూ.250కోట్ల పట్టణ ప్రాంతాల మహిళల కోసం కాగా, రూ.500కోట్లు గ్రామీణ మహిళల కోసమని మంత్రి చెప్పారు. రూ.750 కోట్ల నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఎత్తున లబ్ధి చేకూరుతుందని దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 4.31లక్షల చిన్న సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 46,10,504 కుటుంబాల మహిళలు చిన్నసంఘాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు 10 ఏండ్లలో రూ.21,978 కోట్లు రుణాలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.66,624 కోట్లు మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించినట్లు మంత్రి వివరించారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి 3.67లక్షలకుపైగా సంఘాలకు రూ.18వేల కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 2 లక్షల 29 వేల 382 సంఘాలకు రూ.14.47కోట్లు రుణం ఇప్పించినట్లు వివరించారు. సగటున ఒక్కొక్క సంఘానికి రూ.6.12లక్షల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3.85లక్షలకుపైగా సంఘాలకు రూ.2,561కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 46 లక్షల 20 వేల 984 సంఘ సభ్యులకు లాభం చేకూరిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.